...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

శ‌త‌మానం భ‌వ‌తి...ఆనందంగా క‌ల‌కాలం జీవించ‌టం సాధ్యమేనా..!


ఇష్ట ప‌డి ఏ ప‌ని చేసినా ఆనందంగానే ఉంటుంది. అది క‌ష్టప‌డే ప‌ని అయిన‌ప్పటికీ..! ఇదే సూత్రాన్ని ఆరోగ్యానికి వ‌ర్తింప‌చేయ‌వ‌చ్చు. అంటే శ‌రీరం ఆరోగ్యంగా ఉంటే ఆ ఆనందమే వేరు. ఆరోగ్యంగా ఉంచుకోవ‌టంలో శారీర‌క వ్యాయామం కూడా ముఖ్యమే. పూర్వ కాలంలో జీవ‌న శైలిలోనే వ్యాయామం ఇమిడిఉండేది. దీంతో అప్పటిత‌రం వారు నూరేళ్లు, అంత‌కు మించి జీవించిన దాఖ‌లాలు ఉన్నాయి. ఇప్పటి త‌రానికి 60, 70 ఏళ్లు బ‌త‌క‌ట‌మే గొప్పగా మారుతోంది. ఇందుకు కార‌ణం చాలా సింపుల్‌.. శారీర‌క వ్యాయామం లేక‌పోవ‌టం, మాన‌సిక ఆందోళ‌న పెరిగిపోవ‌టం. ఈ రెంటిని ప‌రిష్కరించుకొంటే ఆనందంగా క‌ల‌కాలం జీవించ‌టం సాధ్యమే.

ఆధునిక జీవ‌న శైలిలో సీటుకి అతుక్కొని గంటల త‌ర‌బ‌డి ప‌ని చేయాల్సి వ‌స్తోంది. దీంతో ఊబ‌కాయం, బ‌రువు పెర‌గ‌టం అన్నది సర్వ సాధారణంగా మారిపోయింది. ఇటువంటి జీవ‌న శైలి వ‌ల్ల అనేక అన‌ర్థాలు ఉన్నాయి. రక్తనాళాల్లో కొవు పేరుకోవ‌టం, గుండె సంబంధిత వ్యాదులు, కొల‌న్ కేన్సర్‌, షుగ‌ర్‌, బీపీ, మాన‌సిక ఒత్తిడి వంటి స‌మ‌స్యలు ఏర్పడుతున్నాయి. వీటి ప్రభావంతో ఆయుష్సు చాలా త్వర‌గా క‌రిగిపోతుంద‌ని వేరే చెప్పన‌క్కర లేదు. ఈ ప‌రిస్థితిని అధిగ‌మించేందుకు ఐదంటే ఐదు చిన్న పాటి ప‌రిష్కారాలు చూద్దాం..
1. ఆఫీసులో పని చేసుకొంటేనే మ‌ధ్య మ‌ధ్యలో లేచి న‌డ‌వ‌టం. లేదంటే వీలుంటే ఆఫీసుకి న‌డిచి వెళ్లటానికి ప్రయ‌త్నించ‌వ‌చ్చు. ఉద‌యం, సాయంత్రం వాకింగ్ లేదా జాగింగ్ కు వెళ్లటం చాలా ఉత్తమం. ఇది సాధ్యం కాక‌పోతే వీధి చివ‌ర షాపుకి లేదా ఆఫీసు ఆవ‌ర‌ణ దాటి వెళ్లటం వంటివి చేయాలి. ఇదేదో ఈసురోమ‌ని నీరసంగా కాళ్లీడ్చుకొంటూ వెళ్లకుండా చ‌క చ‌కా వెళ్లేందుకు ప్రయ‌త్నించాలి.
2. ఇంటి ప‌నిలో భాగ‌స్వామ్యం తీసుకోవ‌టం.. ఇంటి పనిలో చాలా వ్యాయామం ఇమిడి ఉంటుంది. ఉద‌యం ఇల్లు శుభ్రం చేయ‌టం, వంట కు సిద్దం చేసుకోవటం, ఇల్లు స‌ర్దు కోవ‌టం, దుస్తులు రెడీ చేసుకోవ‌టం... ఒక‌టేమిటి, భార్యా భ‌ర్త ఇద్దరూ క‌లిసి క‌ట్టుగా పని చ‌క్క బెట్టుకొంటే చాలా వ్యాయామం జ‌రుగుతుంది. పైగా ఆడుతు పాడుతూ ప‌నిచేస్తుంటే.... అన్న మాట ను రుజువు చేసుకోవ‌చ్చు.
3. వారాంత‌పు శెల‌వుల్ని ఆరోగ్యం కోసం కేటాయించండి. ఆరోజున సైక్లింగ్ చేయ‌టం, స్విమ్మింగ్ చేయ‌టం వంటి ప‌నులు పెట్టుకోవ‌చ్చు. లేదా వారానికి రెండు రోజులు లిఫ్ట్ ఉప‌యోగించ‌కుండా మెట్లదారిని ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇంట్లోనే స్కిప్పింగ్ చేయ‌టం వంటివి చేయ‌గ‌లిగితే భేష్..!
4. ఆట పాట‌ల్ని మించిన వ్యాయామం ఉండ‌దు. టెన్నిస్, ష‌టిల్‌, స్కిప్పింగ్ వంటి వాటిలో పార్టిసిపేట్ చేయ‌వ‌చ్చు. స‌ర‌దాగా డాన్స్ క్లాస్ ల‌కు అటెండ్ అయినా స‌రిపోతుంది.
5. ఒంట‌రిగా వ్యాయామం కుద‌ర‌దు అనుకొంటే ఇద్దరు, ముగ్గురు క‌లిపి సామూహికంగా చేసుకోవ‌చ్చు. ఆరోగ్యం మీద క‌లిసి వ‌చ్చే మిత్రుల‌తో క‌లిసి యాక్టివిటీస్ క‌లుపుకోవ‌చ్చు. కుటుంబ స‌భ్యులు క‌లిసి వాకింగ్‌కు వెళ్లటం అన్నది ఆరోగ్యక‌రం.

- ఇవి కొన్ని మార్గాలు మాత్రమే. మొత్తం మీద శ‌రీరానికి చెమ‌ట ప‌ట్లే విధంగా ఏ రూపంలో క‌ష్టప‌డినా బాగుంటుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో చురుగ్గా ర‌క్త ప్రస‌ర‌ణ జ‌రిగి అన్ని అవ‌య‌వాలు చైత‌న్య వంతం అవుతాయి. వీటి ప్రభావంతో చ‌క చ‌కా ప‌నిచేయ‌గ‌లుగుతాం. అప్పుడు ఆనందంగా క‌ల‌కాలం జీవించ‌డం సాధ్యం అవుతుంది. శ‌త‌మానం భ‌వతి అన్న సూక్తిని నిజం చేయ‌వ‌చ్చు.

ఆడ‌వాళ్లు ఉద‌యం పూట చిరాకుగా ఉంటారా..ఎందుకు..!


ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. మ‌రి అటువంటి ఇల్లాలు ఆనందంగా ఉంటే, ఇల్లంతా ఆనందంగా ఉంటుంది. కుటుంబ స‌భ్యుల‌కు ఇల్లాలే ఆయువు ప‌ట్టు. ఆమె ప్రవ‌ర్తన, ప‌ని తీరుని బ‌ట్టి ఇల్లంతా న‌డుచుకొంటుంది. ఇది మ‌హిళ‌ల్ని పొగిడేందుకు చెప్పడం లేదు. ప్రతీ ఇంట్లో మ‌నం చూసే విష‌యాలే. అయితే, చాలా సంద‌ర్భాల్లో మ‌హిళ‌లు ఉద‌యం పూట చిరాకుగా ఉంటార‌న్న మాట వినిపిస్తోంది. ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇంట్లో ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించ‌వ‌చ్చు.

మ‌హిళ‌లు ఉద‌యం పూట చాలా బిజీ. నిద్ర లేవ‌గానే ఇంటి శుభ్రత‌ను ప‌ట్టించుకోవాలి. బెడ్ రూమ్ ద‌గ్గర నుంచి, వంటిల్లు, హాల్‌, పూజ గ‌ది అన్ని శుభ్రంగా ఉంచేట్లుగా చూసుకోంటారు. భ‌ర్తను, పిల్లల్ని రెడీ చేయ‌టం ఒక ప్రహ‌స‌న‌మే. బెడ్ కాఫీ లేదా టీ రెడీ చేయ‌టం, బ్రేక్ ఫాస్ట్ కు టిఫిన్ త‌యారు చేయ‌టం, ఆఫీసులు, స్కూలుకు కావ‌ల్సినివ‌న్నీ సిద్దంగా ఉంచ‌టం, ఆ త‌ర్వాత లంచ్ బాక్స్ త‌యారు చేసి కుటుంబ స‌భ్యుల్ని సాగ‌నంప‌టంతో సరిపోతుంది. అదే వ‌ర్కింగ్ వుమెన్ అయితే డ‌బుల్ ఢ‌మాకా క‌ష్టాలు ఉంటాయి. గ‌బ గ‌బా తాను కూడా రెడీ అయిపోయి, వ‌స్తువులు రెడీ చేసుకొని ఆఫీసుకు పరిగెత్తాల్సి ఉంటుంది. ఇక‌, ప‌ల్లెటూర్లో అయితే ప‌నులు మార‌తాయి త‌ప్పితే ఈ ప‌నుల‌న్నీ త‌ప్పవు.

ఇన్ని ప‌నుల మ‌ధ్య స‌తమ‌తం అవుతున్న మ‌హిళ‌లు చాలా సార్లు చికాకు ప‌డుతుంటారు. ప‌నుల్లో ఉండ‌గా అడ్డు త‌గిలితే గ‌య్ మంటారు అని మ‌హిళా ద్వేషులు అంటుంటారు.ఇటువంటి కామెంట్లు త‌ప్పు కాబ‌ట్టి చికాకు కి కార‌ణం ఏమిటో క‌నుక్కొందాం.
వాస్తవానికి మ‌నం అంద‌రూ రాత్రి 8-9 గం.ల‌కు డిన్నర్ చేస్తుంటాం. త‌ర్వాత నిద్ర పోయి ఉద‌యం నిద్ర లేచి ఉరుకులు, ప‌రుగులు జీవితం మొద‌లెడ‌తాం. మ‌హిళ‌లు అయితే ర‌న్నింగ్ రేస్‌, హై జంప్ లు, లాంగ్ జంప్ లు చేసుకొంటూ కొన్ని సార్లు భ‌ర‌త నాట్యం, క‌రాటే లు కూడా చేసేస్తారు. త‌ర్వాత కుటుంబ స‌భ్యుల్ని బ‌య‌ట‌కు పంపించాక 10-11 గంట‌ల‌కు కాస్తంత ఎంగిలి ప‌డ‌తారు. అప్పటి దాకా తిండి ఏమాత్రం తిన‌రు. ఇదే పెద్ద త‌ప్పు. అస‌లు అన‌ర్థాల‌కు ఇదే కార‌ణం. రాత్రి చేసిన భోజ‌నం లేదా ఫ‌ల‌హారం నుంచి ఉద‌యం మ‌ళ్లీ తినేదాకా దాదాపు 10-12 గంట‌లు గ్యాప్ వ‌చ్చేస్తుంది. అంటే స‌గం రోజు ఖాళీ క‌డుపుతో ఉండి, స‌గం రోజు మొత్తం తిండికి కేటాయిస్తారు. దీంతో ఉద‌యం పూట శ‌రీరానికి కావ‌ల‌సిన శ‌క్తి అంద‌టం లేదు. శ‌క్తి లేక పోవ‌టంతో మెద‌డు ప‌ని చేయ‌టంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీంతో చిరాకులు, ఒత్తిళ్లు ఉంటాయి. ఫ‌లితంగా అల‌స‌ట‌, కోపం కలుగుతుంది. దీన్ని నివారించాలంటే చిన్న పాటి జాగ్రత్త తీసుకొంటే స‌రిపోతుంది. ఉద‌యాన్నే శ‌రీరానికి కావ‌ల‌సిన గ్లూకోజ్ అందించే పాలు, బిస్కట్ తీసుకోవ‌చ్చు. లేదా పండ్ల ముక్కలు నోటిలో వేసుకొన్నా భేష్... అస‌లు ఉద‌యం కొద్ది సేప‌టి త‌ర్వాత బ్రేక్ ఫాస్ట్ చేసేస్తే అన్ని స‌మ‌స్యలు పరిష్కారం అవుతాయి. లేదంటే మ‌హిళ‌ళే కాదు, పురుషుల‌కు కూడా ఉద‌యం పూట చిరాకు త‌ప్పదు.

లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్‌..! చిన్న పాటి జాగ్రత్త తీసుకోగ‌ల‌రా..!


లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్‌..!.. నిజంగా చాలా అద్భుత‌మైన ప‌ద బంధం ఇది. జీవితాన్ని అందంగా ఆస్వాదించాల‌న్న ఆకాంక్షను మూడు ప‌దాల్లో చెప్పేశారు. ఆనందంగా ఆస్వాదించాలంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యం అన్న సంగ‌తి తెలిసిందే. ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి చాలా చాలా నియ‌మాలు, నిబంధ‌న‌లు పాటించాల‌ని చాలామంది అనుకొంటారు. అంత‌టి హ‌డావుడి ప‌క్కన పెడితే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొంటే చాలా విలువైన ప్రయోజ‌నాలు ద‌క్కించుకోవ‌చ్చు.
ఆహారంలో తాగు నీరు చాలా అవ‌స‌రం అని ఇది వ‌ర‌కే తెలుసుకొన్నాం. కానీ, సుర‌క్షిత తాగునీరు చాలా అవ‌స‌రం. అంటే చాలా ఖ‌రీదైన ప్యూరీ ఫ‌యిర్ల్స్ కొనుక్కొని వాటిలో నీరు పోసి తాగాలని మాత్రం అనుకోవ‌ద్దు. ఫిల్టర్ వాట‌ర్ మాత్రమే సుర‌క్షితం అనుకోవ‌ద్దు. వీట‌న్నింటి క‌న్నా ముఖ్యంగా నీటిని కాచి చ‌ల్లార్చి తాగితే ఎంతో మేలు. ఈ చిన్నపాటి జాగ్రత్త తీసుకొనేందుకు మ‌న మ‌న‌స్సు అంగీక‌రించ‌దు.

నీటితో చాలా సూక్ష్మ జీవులు వ్యాపిస్తాయి. వీటిని వైర‌స్‌, బ్యాక్టీరియా, ప్రోటోజోవ‌న్లు, వ‌ర్మ్ జీవులు అని వ‌ర్గీక‌రించ‌వ‌చ్చు. వీటి ద్వారా వ‌చ్చే వ్యాధుల్ని వాట‌ర్ బార్న్ వ్యాధులు అంటారు. ఉదాహ‌ర‌ణ‌కు నీటిలో సంక్రమిత వైర‌స్ ఉంటే హెప‌టైటిస్ ఎ, హెప‌టైటిస్ ఈ అనే ర‌కపు కామెర్లు సోకుతాయి. డ‌యేరియా అనే ప్రమాద‌క‌ర వ్యాధి కూడా నీటి ద్వారానే సంక్రమిస్తుంది. బ్యాక్టీరియా తో టైఫాయిడ్‌, పారా టైఫాయిడ్‌, క‌ల‌రా వంటి రోగాలు సోకుతాయి. ఇత‌ర సూక్ష్మ జీవుల‌తో  అమీబియాసిస్ వంటి ఇబ్బందులు ఏర్పడుతాయి. వీటిలో కొన్ని ప్రాణాంత‌క వ్యాధులు కూడా..!
ఇన్ని వ్యాధులు సంక్రమించ‌టానికి నీరే కార‌ణం. ముఖ్యంగా ఈ వ‌ర్షాలు ప‌డే స‌మ‌యంలో తాగు నీటి పైప్ లైన్‌లు, మురుగు నీటి పైప్ లైన్ లు క‌లుస్తుంటాయి. మ‌న‌కు తెలియ‌కుండానే మురుగు నీరు, ఈ తాగునీటితో క‌లిసిపోతుంది. అటువంట‌ప్పుడు ఫిల్టర్ లు, ప్యూరిఫ‌యిర్లు ఎంత వ‌ర‌కు శుభ్రప‌రుస్తాయ‌న్నది ఆయా ప‌రికరాల నాణ్యత మీద ఆధార‌ప‌డి ఉంటుంది.

 అంత‌మాత్రాన ఈ పరికరాల్ని త‌ప్పు ప‌ట్టడం మ‌న ఉద్దేశం కానే కాదు. కానీ, సామాన్యులు సైతం ఈ ప‌రిక‌రాలు లేక‌పోయిన సుర‌క్షిత తాగునీటిని తీసుకోవ‌చ్చు అని చెప్పట‌మే మ‌న ఉద్దేశం. చ‌క్కగా కాచి చ‌ల్లార్చిన నీటిని తీసుకొంటే వాట‌ర్ బార్న్ డిసీజ్‌ల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చు. కుటుంబ స‌భ్యులంతా ఆరోగ్యంగా ఉంటే జీవ‌తాన్ని అందంగా ఆస్వాదించ‌వ‌చ్చు. అప్పుడే క‌దా లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్‌..!...!

నీళ్లు ఎక్కువ తాగితే ఏమ‌వుతుంది..!


ఇటీవ‌ల కాలంలో తాగునీటి మీద అవ‌గాహ‌న పెరిగింది.గ‌తంతో పోల్చుకొంటే నీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌టం అల‌వాటుగా మార్చుకొంటున్నారు. శ‌రీరానికి నీరు చాలా అత్యవ‌స‌ర అంశం అన‌టంలో ఎటువంటి సందేహం లేదు పైగా వివిధ ర‌కాల జీవ‌న క్రియ‌లు సాఫీగా జ‌ర‌గ‌టానికి తాగునీరు చాలా బాగా ఉప‌యోగ ప‌డుతుంది. అదే స‌మ‌యంలో చాలినంత నీరు ఉంటే జీవ‌నానికి స‌రిపోతుంది. అదే ప‌నిగా నీరు తాగితే మాత్రం ఇబ్బంది త‌ప్పదు.

స‌గ‌టున మాన‌వునికి ఒక రోజుకి మూడు లీట‌ర్ల నీరు స‌రిపోతుంది. నేరుగా తీసుకొనే నీటితో పాటు అడ‌పా ద‌డ‌పా ఆహార ప‌దార్థాల రూపంలో కూడా నీరు అందుతుంది. ఈ మాత్రం నీరు స‌రిపోతుంది. ఇంత‌కు మించితే మాత్రం జీర్ణాశ‌యం, కాలేయం మ‌రియు మూత్ర పిండాల ప‌నితీరు మీద ప్రభావం చూపుతుంది. అక్కడ నీరు ఎక్కువ‌గా పేరుకొని పోతే, ఇత‌ర ప‌దార్థాలు స‌క్రమంగా వినియోగించుకోవటం క‌ష్టత‌రం అవుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు జీర్ణాశ‌యాన్ని తీసుకొంటే, క‌డుపులో సగం ఆహారం తీసుకొని, పావు భాగం నీటితో నింపి, పావు భాగాన్ని ఖాళీగా ఉంచుకోమ‌ని చెబుతారు. దీన్ని పాటించ‌కుండా అదే ప‌నిగా నీటితో నింపితే జీర్ణ వ్యవ‌స్థ ప‌నితీరు దెబ్బతింటుంది. దీంతో చిన్న ప్రేగుల మీద కూడా ఒత్తిడి ఏర్పడుతుంది.
ప‌గ‌టి పూట ఎక్కువ‌గా నీరు తీసుకొంటే రాత్రి పూట ఈ నీటి వినియోగం త‌గ్గించుకొంటే స‌రిపోతుంది. దీంతో నీటి వినియోగం స‌మ‌తుల్యంగా ఉంటుంది. ఈ విష‌యాన్ని ఎప్పటిక‌ప్పుడు క‌చ్చితంగా పాటించాల్సిన అవ‌స‌రం లేదు. కానీ, నీటిని స‌రాస‌రిన లెక్కవేసుకొంటే చాలు.

హాయిగా ఫుడ్డు తినండి.. చ‌క్కగా బ‌రువు త‌గ్గండి..!

బ‌రువు కి ఆహారానికి విడ‌దీయ‌రాని సంబంధం ఉంది. చాలామంది బ‌రువు త‌గ్గాలంటే ఆహారం తినటం త‌గ్గించాల‌ని అనుకొంటారు. ఇందులో కొంత వ‌ర‌కు వాస్తవం ఉంది. ఎక్కువ కొవ్వును మిగిల్చే ఆహారం తీసుకొంటే బ‌రువు పెర‌గ‌టం త‌థ్యం. ఇది స‌హ‌జ సూత్రం. అదే స‌మ‌యంలో ఆహారాన్ని త‌గ్గిస్తే మాత్రం కొంచెం ఇబ్బందే. శ‌రీరానికి అవ‌స‌ర‌మైన పోష‌కాలు అందించే ఆహారం తీసుకొంటూనే కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకొంటే మాత్రం నాజూకుగా మారిపోవ‌చ్చు.ఇందుకోసం ఉప‌క‌రించే ఆహారం ఇప్పుడు చూద్దాం..

1.ఆకు కూర‌లు.. ఆకు కూర‌ల‌తో చాలా ఉప‌యోగం ఉంద‌న్న సంగ‌తి తెలిసిందే. వీటిని తీసుకొంటే కొవ్వు బెడ‌ద ఉండ‌దు, కానీ చ‌క్కటి పోష‌కాలు, ల‌వ‌ణాలు అందుతాయి. నడుము భాగంలో కొవ్వు పేరుకొని పోతోంద‌ని బెంగ ప‌డే వారికి ఇది చ‌క్కటి ప‌రిష్కారం. నూనెలో వేయించ‌కుండా, నీటితో ఉడికించుకొని పొడి ఆహారంగా తీసుకొంటే కావాల్సిన ప్రయోజ‌నాలు పొంద‌వ‌చ్చు.
2. పాలు, మ‌జ్జిగ‌.. పెరుగు, మీగ‌డ‌ల‌తో కొవ్వు పెరిగే అవ‌కాశం ఉంది. కానీ, పాలు, ప‌ల్చటి మ‌జ్జిగ‌తో ఈ ఇబ్బంది ఉండ‌దు. పైగా శ‌రీరానికి కావ‌ల్సిన కాల్షియం అందుతుంది. కాల్షియం తో శ‌రీర ప‌టుత్వం సాధ్యం అవుతుంది.
3. గుడ్లు.. గుడ్డు ఎక్కువ‌గా తీసుకొంటే ప్రొటీన్స్ ఎక్కువ‌గా చేర‌తాయి. కండ‌రాలు గట్టి ప‌డేందుకు ఇది చాలా అవ‌స‌రం. విటమిన్ బీ 12, తో పాటు ఎనిమిదిర‌కాల ల‌వ‌ణాలు, కాల్షియం, ఐర‌న్ వంటి పోష‌కాలు ల‌భిస్తాయి. జీవ‌న‌క్రియ‌లు సాఫీ గా జ‌రిగేందుకు అవ‌స‌ర‌మైన అన్ని అంశాలు గుడ్డులో దొర‌కుతాయి.

4. చేప‌లు.. మాంసాహారంలో కోడిమాంసం, మేక మాంసం వంటి వాటిక‌న్నా చేప‌లు మేలు అని చెబుతారు. వీటితో కొవ్వులు క‌ర‌గ‌టంతో పాటు ప్రోటీన్లు స‌మృద్ధిగా ల‌భిస్తాయి. ఒత్తిడి సంబంధిత ర‌సాయ‌నాలు పేరుకోకుండా నిరోధించ‌టం ద్వారా లావు కాకుండా నివారించ‌వ‌చ్చు. చ‌క్కటి ల‌వ‌ణాలు ల‌భించ‌టం మ‌రో ఉప‌యోగ‌క‌ర‌మైన అంశం.
5. గ్రీన్ టీ.. తాజా గ్రీన్ టీ తో ఉత్సాహం క‌లుగుతుంది. మెద‌డు చురుగ్గా ఉండ‌టం ద్వారా అన‌వ‌స‌ర‌పు ర‌సాయ‌నాల స్రావ‌కాన్ని నిరోధించ‌వ‌చ్చు.
శ‌రీరంలో అన‌వ‌స‌ర‌పు నిల్వల్ని తొల‌గించ‌టంలో గ్రీన్ టీ ఉప‌క‌రిస్తుంది.
ఈ ఐదు ర‌కాల ఆహారాన్ని తీసుకోవ‌టం ఎంత ముఖ్యమో, కొవ్వును మిగిల్చే జంక్ ఫుడ్ ల‌కు దూరంగా ఉండ‌టం అంత ప్రధానం. ఐస్ క్రీమ్‌లు, బ‌ర్గర్ల, స్వీట్స్ ను దూరం పెడితే బ‌రువు త‌గ్గటం సాధ్యం అవుతుంది.