...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

మీ ఫుడ్ కు ఒక చిక్కుంది.. దానికో లెక్కుంది..!


ఆహారం తీసుకోవ‌టంలో ఒక చిక్కు ఉంది. కానీ దీన్ని ఒక లెక్క ద్వారా ప‌రిష్కరించుకోవ‌చ్చన్న మాట‌. అదేమిటో ఇప్పుడు తెలుసుకొందాం.
శ‌రీరం దైనందిక క్రియ‌లు నెర‌వేర్చుకొనేందుకు శ‌క్తి అవ‌స‌రం. దీన్ని క్యాల‌రీల్లో కొలుస్తారు. ఈ శ‌క్తి వినియోగం అన్నది జీవ‌న శైలి మీద ఆధార ప‌డి ఉంటుంది. శారీర‌క క‌ష్టం చేసేవారి విష‌యంలో ఒక ర‌కంగా ఉంటే, నీడ ప‌ట్టున ఉండి ఉద్యోగాలు చేసే వారికి ఒక ర‌కంగా ఉంటుంది. ప‌ల్లె జీవుల్లో ఆయా వృత్తి వ్యవ‌హారాల మీద ఈ క్యాల‌రీల వినియోగం మారుతూ ఉంటుంది. ప‌ట్టణ, న‌గ‌ర వాసుల విష‌యంలో ఈ క్యాల‌రీల వినియోగం దాదాపుగా ఒకే మాదిరి ఉంటుంది. ఈ వ్యాసంలో మాత్రం ఆహారంలో తాజా పండ్లు, కూర‌గాయ‌ల వినియోగం గురించి చ‌ర్చించుకొందాం..

శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ప‌దార్థాల్లో పిండిప‌దార్థాలు, మాంస‌కృత్తులు, కొవ్వులు ముఖ్యమైన‌వి. వీటితో పాటు ల‌వణాలు, విట‌మిన్‌లు, సూక్ష్మ పోష‌కాలు అవ‌స‌రం. అన్నం, పెరుగు వంటి వాటి ద్వారా పిండి ప‌దార్థాలు, కొవ్వులు అందుతుంటాయి. కానీ, ముఖ్యమైన మాంస‌కృత్తులు, ల‌వ‌ణాలు, విట‌మిన్స్ కోసం త‌ప్పనిస‌రిగా కూర‌గాయ‌లు లేదా మాంసాహారం మీద ఆధార ప‌డాలి. పైగా ఈ మాంస‌కృత్తులు(ప్రొటీన్స్) లేక‌పోతే మాత్రం చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అందుచేత ఆహారంలో కూర‌గాయ‌లు త‌ప్పనిస‌రి. అటు, ల‌వ‌ణాలు, విట‌మిన్స్ కోసం పండ్లు కూడా త‌ప్పనిస‌రి.

పండ్లు, కూర‌గాయ‌లు ఏ మేర‌కు అవ‌స‌రం అనే విష‌యంలో ఒక లెక్క ఉంది. ప‌ట్టణ లేక న‌గ‌ర జీవులు అర గంట కు మించి శారీర‌క శ్రమ ఉండ‌దు అన్న సాదార‌ణ సూత్రం ప్రకారం దీన్ని గ‌ణించ‌వ‌చ్చు. పురుషుల విష‌యంలో పాతికేళ్ల లోపు వ‌య‌సు వారికి 2,600 క్యాల‌రీలు అవ‌స‌రం. అందుచేత రెండు క‌ప్పుల పండ్లు, మూడున్నర క‌ప్పుల కూర‌ అవ‌స‌రం ఉంటాయి. పాతికేళ్లు దాటిన వారికి 2,200 క్యాల‌రీలు అవ‌స‌రం కాబ‌ట్టి రెండు క‌ప్పుల పండ్లు, మూడు క‌ప్పుల కూర అవ‌స‌రం ఉంటుంది. మ‌హిళల విష‌యానికి వ‌స్తే పాతికేళ్ల లోపు వ‌య‌సు వారికి 2,000 క్యాల‌రీలు అవ‌స‌రం. అందుచేత రెండు క‌ప్పుల పండ్లు, రెండున్నర క‌ప్పుల కూర అవ‌స‌రం. పాతిక సంవ‌త్సరాల వ‌య‌సు దాటిన వారికి 1800 క్యాల‌రీలు అవ‌స‌రం. అందుచేత ఒక‌టిన్నర క‌ప్పుల పండ్లు, రెండున్నర క‌ప్పుల కూర అవ‌సరం.
వాస్తవానికి కొద్దో గొప్ప కూర‌లు రోజూ తీసుకొంటారు. కానీ, చాలామంది పండ్లు రోజు తీసుకొనే అల‌వాటు ఉండ‌దు. ఇది చాలా త‌ప్పు. పండ్లు ద్వారా శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ల‌వ‌ణాలు, పోష‌కాలు అందుతుంటాయి. అందుచేత పండ్లు రోజూ తీసుకోవ‌టం అల‌వాటు చేసుకోవాలి. దీంతోపాటు కూర కూడా ఎక్కువ తీసుకోవ‌టం ఉత్తమం.

బ‌రువు త‌గ్గించుకొనేందుకు ఒక చిట్టి చిట్కా..!


బ‌రువు త‌గ్గించుకోవాల‌న్న ఆరాటం ఇటీవ‌ల కాలంలో ఎక్కువైంది. సైజు త‌గ్గించుకోవ‌టం ఒక ఎత్తయితే, బ‌రువు కు క‌ళ్లేం వేయాల‌న్న ఆరాటం అధికంగాఉంది. ఈ టెన్షన్ లో తిండి మానలేక‌, బ‌రువు త‌గ్గలేక ఇబ్బంది ప‌డుతుంటారు. ఇటువంటి వారి కోసం ఒక చిట్కా చెబుతున్నారు వైద్యులు. నీటిని తాగ‌టం పెంచితే ఆటోమేటిక్ గా బ‌రువు త‌గ్గవ‌చ్చట‌..! విన‌టానికి వింత‌గా ఉన్నా, ఇది నిజం అంటున్నారు. ద జ‌ర్నల్ ఆఫ్ క్లినిక‌ల్ ఎండోక్రైనాల‌జీ అండ్ మెట‌బాల‌జీ అనే వైద్య శాస్త్ర సంచిక‌లో ఈ విష‌యాన్ని వెల్లడించారు.

వాస్తవానికి మెద‌డుకి ఆక‌లి, దాహం మధ్య తేడా పెద్దగా తెలీదు. రెండు విష‌యాల్లో ఒకే ర‌కమైన సిగ్నల్స్ అందుతాయ‌ట‌. అందుచేత జీర్ణాశ‌యంలో కాస్తంత నీటిని నింపితే క‌డుపు నిండుతున్నట్లుగా ఉంటుంది. దీంతో తీసుకొనే ఆహారం ప‌రిణామం త‌గ్గుతుంది. ఆహారం లో ఉండే నీటి విలువ‌తో ఈ తాగునీటి విలువ క‌లుపుకొంటే క‌డుపులో ప‌దార్థం ప‌రిణామం పెరుగుతుంది. దీంతో పాటుగా నీటిలో ఉండే ల‌వ‌ణాలు ఈ మోతాదు పెంపుకి తోడ్పడుతాయి. పైగా నీటిలో ఎటువంటి క్యాల‌రీల శ‌క్తి ఉండ‌దు. ఈ క్యాల‌రీల గోల లేకుండా క‌డుపుని నింపేసుకొనే చాన్స్ అన్న మాట‌.

అందుచేత చ‌క్కగా నీటిని తాగ‌టం ద్వారా ఈ ప‌రిస్థితిని అదుపుచేసుకోవ‌చ్చు. ఒక లెక్క ప్రకారం రోజుకి ఒక లీట‌రున్నర నీటిని ఎక్కువ‌గా తాగితే 17 వేల 400 క్యాల‌రీలు క‌రుగుతాయి.అంటే దాదాపు రెండు కిలోల బ‌రువుకి ఎస‌రు పెట్టవ‌చ్చు. నెల రోజుల క్రమంలో ఈ ఫ‌లితాన్ని చూడ‌వ‌చ్చట‌. అంత మాత్రాన అదే ప‌నిగా నీటిని తాగేస్తే మాత్రం కొంప కొల్లేరు అవుతుంది సుమా..!

ఆహారంలో పంచామృతం..


ఆహారంలో ఐదు ర‌కాల అమృతాలు ఉన్నాయి. అవి మీకు తెలుసా..ఆహారం చ‌క్కగా జీర్ణం అయి, శ‌రీరంలో చ‌క్కగా శ‌క్తి క‌లిసి పోతే అది అమృత‌మే అవుతుంది క‌దా..దీన్ని బ‌ట్టి చూస్తే ఐదు ర‌కాల ఆహారాలు తేలిగ్గా జీర్ణం అవుతాయ‌ని గుర్తించారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం..

1. అన్నం.. చూడ‌టానికి సాదా సీదాగా ఉన్నా అన్నం .. తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారం. కూర‌లు, సాంబారు వంటివే గాకుండా పాలు, పెరుగు వంటి వాటితో క‌లుపుకొని అన్నం తింటూ ఉంటారు. అయితే ఏ ప‌దార్థంతో క‌లిపినా కానీ, అన్నం స్వభావ రీత్యా తేలిగ్గా జీర్ణం అయ్యే ల‌క్షణం క‌లిగి ఉంటుంది. అందుకే అన్నం ప‌ర‌బ్రహ్మ స్వరూపం అన్న సూక్తి జ‌నించి ఉంటుంది. అన్నం ద్వారా ఎక్కువ‌గా పోష‌క ప‌దార్థాలు శ‌రీరానికి స‌మ‌కూర‌తాయి.

2. చికెన్.. మాంసాహారంలో చికెన్ త్వర‌గా జీర్ణం అయ్యే ల‌క్షణం క‌లిగి ఉంటుంది. మ‌ట‌న్‌, చేప‌లు, పీత‌లు వంటి వాటికి గ‌ట్టి జీర్ణ స్వభావం ఉంటుంది. చికెన్ ను తేలిగ్గా జీర్ణించుకోవ‌చ్చు. పైగా భార‌త్ వంటి దేశాల్లో ఇది కామ‌న్ గా ఉండే నాన్ వెజ్ డిష్‌. ప‌ల్లెల్లో, ప‌ట్టణాల్లో కూడా విరివిగా దొరికే మాంసాహారం ఇది.

3. సూప్‌.. బోజ‌నంలో చారు, ర‌సం వంటివి జోడించుకోవ‌టం ఎప్పటినుంచో ఉన్న అల‌వాటు. ఆహారానికి మొద‌ట‌గా కొంచెం సూప్ తీసుకోవ‌టం మోడ‌ర్న్ మెనూ లో త‌ప్పనిస‌రి. రుచిగా ఉండ‌టంతో పాటు ఇందులో ఇంకో ప‌ర‌మార్థం కూడా ఉంది. కొంచెం కారం, కొంచెం ఉప్పగా ఉండే సూప్ తీసుకోవ‌టంతో నాలుక మీద ఉండే రుచిమొగ్గలు క్రియాశీల‌కంగా మార‌తాయి. దీంతో త‌ర్వాత తీసుకొనే ఆహారంలోని అన్ని రుచులు చ‌క్కగా తెలుస్తాయి. ఫ‌లితంగా అన్ని రుచుల్ని ఆస్వాదించేందుకు వీల‌వుతుంది.

4. పండ్లు.. ఆహారంలో పండ్లు, పండ్ల ముక్కలు వంటివి జోడిస్తే చ‌క్కగా జీర్నం అవుతాయి. అంతే గాకుండా పండ్లను తీసుకొంటే జీర్ణాశ‌యం శుభ్ర ప‌ర‌చుకొనేందుకు వీల‌వుతుంది. పండ్ల లో ఉంటే కొన్ని ర‌కాల జీవ ర‌సాయ‌నాలు యాక్టివేట‌ర్స్ గా ఉప‌క‌రిస్తాయి. పండ్లను స‌లాడ్ గా, పండ్ల ర‌సాలుగా, చిన్న ముక్కలుగా తీసుకొనే అల‌వాటు ఉన్నది.

5. ఆకు కూర‌లు... ఆకు కూర‌లు, ఆకుల‌తో కూడిన క్యాబేజీ వంటివి పోష‌క విలువ‌లు క‌లిగి ఉంటాయి. అంతేగాకుండా త్వర‌గా ప‌చ‌నం అవుతాయి. ఈ ఆకు కూర‌ల‌ను జోడించ‌టంతో ఆహారం చ‌క్కటి పోష‌క స‌మ‌తుల్యత క‌లిగి ఉంటుంది.

ఆహారం తీసుకోవ‌టంలో మెళ‌కువ‌లు అవ‌స‌ర‌మా..!


ఆరోగ్యమే మ‌హా భాగ్యం అంటారుక‌దా..! అటువంటి ఆరోగ్యానికి ఆహారానికి ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు.ఆహారం తీసుకోవ‌టంలో కొద్ది పాటి మెళ‌కువ‌లు పాటిస్తే ఆరోగ్యాన్ని మ‌హా భాగ్యం గా కాపాడుకోవ‌చ్చు. ఆ మెళ‌కువలు ఇప్పుడు చూద్దాం..

ఆహారం తీసుకోగానే జీర్ణాశ‌యంలో కొన్ని స్రావ‌కాలు ఊర‌టం మొద‌ల‌వుతాయి. అందుచేత మొద‌ట‌గా ఆహారంలోని ప‌దార్థాలు లోప‌ల‌కు ప్రవేశించ‌గానే .. ఇందుకు సంబంధించిన సిగ్నల్స్ అందిపోతాయి అన్న మాట‌. దీంతో ఆహారం లోప‌ల‌కు ప్రవేశిస్తుంది కాబ‌ట్టి జీర్ణం చేయ‌టానికి కావ‌ల‌సిన స‌రంజామా రెడీ అవుతుంది. తీరా చేసి ఆ స‌మ‌యానికి కొద్ది పాటి చిరుతిళ్లు తినేసి, త‌ర్వాత బై చెప్పేస్తే ఈ ఏర్పాట్లు అన్నీ వృధా అయిపోతాయ‌న్న మాట‌. ముఖ్యంగా చాలామంది ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేప్పుడు చాట్ కానీ, స్నాక్స్ కానీ తీసుకొని క‌డుపుని కాస్తంత ఇబ్బంది పెట్టి ఆ త‌ర్వాత ఇంటికి తాపీగా వెళ‌తారు. ఆ త‌ర్వాత భోజ‌నానికి ఉప‌క్రమిస్తారు. దీని వ‌ల్ల క‌డుపు కూడా మ‌నమీద విసుక్కొంటుంది. ఈ విసుగుద‌ల తో స‌రిగ్గా ప‌ని చేయ‌టానికి మొండికేస్తుంద‌న్న మాట‌. అందుచేత భోజ‌నం చేసే స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు చిరుతిళ్ల వైపు వెళ్ల కుండా ఉండే మేలు. ఈ లోగా ఆక‌లి అంటూ బెల్స్ మోగుతూ ఉంటాయి కాబ‌ట్టి నేరుగా భోజ‌నం చేసేలా ప్లాన్ చేసుకోవాలి.

దీంతో పాటు భోజ‌నంలో కొంత ప‌దార్థం తినేసి టీవీ సీరియ‌ల్స్ లో మునిగిపోయి, ఆ త‌ర్వాత వాణిజ్య ప్రక‌ట‌న‌లు వ‌చ్చినప్పుడు మిగతా భాగం తినే అల‌వాటు కొంద‌రికి ఉంటుంది, సారీ చాలామందికే ఉండ‌వ‌చ్చు. కానీ, ఇది కూడా స‌రికాదు, ఎందుకంటే ఆహారం లోప‌ల‌కు ప్రవేశించాక అన్నవాహిక‌, జీర్ణాశ‌యం, కాలేయం, క్లోమం, శేషాంత్రికం, పిత్తాశ‌యం, పెద్ద ప్రేగు వంటి అనేక భాగాలు ఉత్తేజితం అవుతాయి.అక్కడ జీర్ణ ప్రక్రియ ఒక నిర్దిష్ట ప‌ద్దతిలో జ‌రుగుతుంది. దీనికి ప‌దే ప‌దే అంత‌రాయం క‌లిగించ‌టం స‌రికాదు. అదే స‌మ‌యంలో ఒకేసారి ఆహారాన్ని పెద్ద మొత్తంలో తీసుకోవ‌టం క‌న్నా వాయిదాల ప‌ద్దతిలో తిన‌టం మేలు అన్న వాద‌న ఉంది. దీని వివ‌రాలు త్వర‌లోనే తెలుసుకొందాం...

రాత్రి భోజ‌నంలో చిన్న పాటి జాగ్రత్త..!


ఆహారానికి ఆరోగ్యానికి ఎంతో అవినావ భావ సంబంధం ఉంది. ఆహారం బాగుంటే ఆరోగ్యం దానంత‌ట అదే బాగుంటుంది. ముఖ్యంగా రాత్రి భోజ‌నం విష‌యంలో కొద్ది పాటి జాగ్రత్త అవ‌స‌రం. ఎందుకంటే రాత్రి ఆహారం తీసుకొన్న త‌ర్వాత జీర్ణం అయ్యేందుకు ప‌ట్టే స‌మ‌యం దృష్టి పెట్టుకోవాలి. భోజ‌నం లో గ‌ట్టి పాటి ఘ‌నాహారం ఉంటే జీర్ణం అయ్యేందుకు స‌మ‌యం తీసుకొంటుంది. చాలామంది భోజ‌నం తిన్న వెంట‌నే ప‌డుకొనే అల‌వాటు క‌లిగి ఉంటారు. ఇది స‌రి కాదు. ఎందుకంటే ఆహారం తీసుకొన్న త‌ర్వాత 3-4 గంట‌ల పాటు జీర్ణాశ‌యంలోనే ఉంటుంది. ఆ స‌మ‌యంలో ఎంజైమ్ లు స్రవించ‌టం, జీర్ణ ప్రక్రియ ఊపందుకోవ‌టం జ‌రుగుతుంది. కానీ, ఆహారం తీసుకొన్న వెంట‌నే నిద్ర లోకి జారుకొంటే ఈ ప్రక్రియ మంద‌గిస్తుంది. కొద్ది సేపు మెళ‌కువగా ఉండ‌టం ద్వారా జీర్ణ ప్రక్రియ మొద‌లై పోతుంది. ఈ స‌మ‌యంలో కొద్ది దూరం న‌డిస్తే చాలా మంచిద‌ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొద్ది పాటి న‌డ‌క ద్వారా జీర్ణ ప్రక్రియ చ‌క్కగా ప్రారంభం అవుతుంది. అందుచేత దీనికి త‌గిన‌ట్లుగా ఆహార వేళ‌లు ప్లాన్ చేసుకొంటే మంచిది. భోజ‌నం తీసుకొన్న త‌ర్వాత కొద్ది పాటి న‌డ‌క‌తో కాసేపు విశ్రాంతి తీసుకొని, ఆ త‌ర్వాత నిద్రకు ఉప‌క్రమించాలి. ఈ స‌మ‌యంలో వేడిగా పాలు తీసుకొనే అల‌వాటు కొంత‌మందికి ఉంటుంది. ఇది ఆమోద‌యోగ్యమే. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తల‌తో ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌టం మంచి ల‌క్షణం.

అన్నం తిన‌టం అంద‌రికీ తెలుసు..కానీ, ఆరోగ్య క‌రంగా తిన‌టం తెలుసా..!


ఇటువంటి ప్రశ్న అడ‌గ‌టం స‌భ్యత‌గా ఉండ‌దు. ఎందుకంటే చిన్నత‌నం నుంచి అంద‌రికీ అల‌వాటైన ప‌ని గురించి ప్రశ్నించ‌టం త‌ప్పు. అయిన‌ప్పటికీ, ఆరోగ్యక‌రంగా ఆహారాన్ని తీసుకోవ‌టం అన్నది ముఖ్యం. తిన్నామంటే తిన‌టం, తిరిగామంటే తిర‌గ‌టం అన్నది స‌రైన విధానం కాదు. ఆహారం తీసుకొనేట‌ప్పుడు స‌రైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం..



1. ఆహారం తీసుకొనే ముందు ప్రశాంత‌త అవ‌స‌రం. హ‌డావుడి ప‌డ‌కుండా, నెమ్మదిగా భుజించాలి.దాదాపుగా 20 నిముషాల వ్యవ‌ధిలో ఆహారం తీసుకొంటే మంచిద‌ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టీవీ చూస్తూ, సీరియ‌ల్స్, సినిమా్ల్లో లీనం అయి ఆహారం తీసుకోవ‌టం స‌రికాదు. కుటుంబ స‌భ్యుల‌తో కానీ, మిత్రుల‌తో క‌లిసి కానీ ఆనంద‌క‌రంగా ఆహారం తీసుకోవటం ఉత్తమం.
2. ఆహారం తీసుకొనేముందు ఒక గుక్క నీటిని తాగాలి. త‌ర్వాత క‌నీసం రెండుసార్లు అయినా కొద్ది పాటి నీరు తాగాలి. దీని వ‌ల్ల ఆహారం చ‌క్కగా మిశ్రమం అవుతుంది.
3. ఆహారంలో ఒకే ర‌క‌మైన ఫుడ్ మంచిది కాదు. కూర‌లు, ప‌చ్చడి, సాంబారు వంటి వెరైటీలు అనుకోవ‌ద్దు. పిండిప‌దార్థాలు, మాంస‌కృత్తులు, కొవ్వులు ఉండేట్లుగా చూసుకోవాలి. విట‌మిన్స్, ల‌వ‌ణాలు, సూక్ష్మ పోష‌కాలు కూడా త‌ప్పనిసరి.
4. ఒకే ర‌కమైన ఆహారానికి అల‌వాటు ప‌డ‌కూడ‌దు. విభిన్న ర‌కాలు ఆహార ప‌దార్థాల‌తో స‌మ్మిశ్రితంగా భుజించాలి.
5. న‌చ్చిన ఆహారం విప‌రీతంగా తిన‌టం, న‌చ్చక‌పోతే దూరం పెట్టడం అంత మంచిది కాదు. ఆహారాన్ని స‌మతుల్యంగా ఉంచుకోవాలి.

6. ఆహారం లో క‌డుపు నిండ‌టం ముఖ్యం. అంటే క‌డుపులో స‌గం వ‌ర‌కు ఘ‌న ఆహారం, పావు వంతు ద్రవం ఉండాలి. మిగిలిన పావు వంతు ఖాళీగా ఉంటే చ‌క్కగా జీర్ణం అవుతుంది.
7. భోజ‌నంలో పండ్లు, కూర‌గాయ‌లు ఉంచుకొంటే బాగుంటుంది.
8. ఆహారం ఒకే సారి ఎక్కువ‌గా తీసుకోవ‌ద్దు. మితంగా నాలుగైదు విడ‌త‌లుగా తీసుకోవ‌టం మేలు.
9. భోజ‌నం త‌ర్వాత స‌రిప‌డినంత నీరు తీసుకోవాలి.
10. రాత్రి భోజ‌నం త‌ర్వాత క‌నీసం 100 నుంచి 200 అడుగులు న‌డ‌వాలి. క‌నీసం అర‌గంట వ్యవ‌ధి త‌ర్వాతే నిద్రకు ఉప‌క్రమించాలి.

లైఫ్ లో టైమ్ టేబుల్ చాలా ముఖ్యం..


చిన్నప్పుడు స్కూల్ కు వెళ్లేప్పుడు టైమ్ టేబుల్ చెక్ చేసుకోవ‌టం అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. టైమ్ టేబుల్ కు అనుగుణంగా బుక్స్ స‌ర్దుకోవ‌టం, హోమ్ వ‌ర్క్ వ‌గైరా పూర్తి చేసుకోవ‌టం అప్పట్లో త‌ప్పనిస‌రి. ఇప్పుడు అదే టైమ్ టేబుల్ ను గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మ‌న శ‌రీరంలో కూడా అంత‌ర్గత అవ‌య‌వాల‌కు ఒక టైమ్ టేబుల్ ఉంటుంది. ఆయా భాగాల‌న్నీ ఒక టైమ్ ప్రకారం ప‌ని చేస్తాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవ‌స్థలో ఇది స్పష్టంగా క‌నిపిస్తుంది.
ఆహారాన్ని తిన‌టం మొద‌లు పెట్టగానే నోటిలో లాలాజ‌లం ఊరుతుంది క‌దా. అప్పటి నుంచి లోప‌ల‌కు ప్రవేశించాక‌, ఒక్కో అవ‌యవాన్ని దాటుకొని వెళ్లేప్పుడు కొన్ని జీవ ర‌సాయ‌న ప్రక్రియ‌లు జ‌రుగుతాయి. ఇవ‌న్నీ ఒక స‌మ‌యానికి జ‌రిగేట్లుగా లోప‌ల బ‌యో వాచ్ అమ‌రి ఉంటుంది. ఆ స‌మ‌యానికి ఆయా అవ‌య‌వం అల‌ర్టు గా ఉంటుంది. ఉద‌యం టిఫిన్ స‌మ‌యం, మ‌ధ్యాహ్నం భోజ‌న స‌మ‌యం, సాయంత్రం స్నాక్స్ టైమ్‌, రాత్రి మ‌ళ్లీ ఆహారం తీసుకొనే స‌మ‌యం ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఆ స‌మ‌యంలో ఆహారం ఆయా అవ‌యవంలో చేరుకొంటే చ‌క్కగా జీర్ణం అవుతుంది. దీని వ‌ల్ల ఫ‌లితం స‌క్రమంగా అందుతుంది.

ఉద్యోగం, వ్యాపారం, ఇత‌ర ప‌నుల్లో ప‌డిన వారు ఈ స‌మ‌య పాల‌న ప‌ట్టించుకోరు. ముఖ్యంగా మ‌హిళ‌లు ఇంట్లో ఒంట‌రిగా ఉన్నప్పుడు ర‌క ర‌కాల స‌మ‌యాల్లో ఆహారం తీసుకొంటారు. దీని వ‌ల్ల ఈ బ‌యో వాచ్ స‌మ‌య పాల‌న పాడ‌వుతుంది. అటువంటి స‌మ‌యాల్లో శ‌రీరంలో జీవ ర‌సాయ‌న ప్రక్రియ‌ల‌కు ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ ఇబ్బంది ని త‌ప్పించుకోవాలంటే సాధ్యమైనంత వ‌ర‌కు ఒకే స‌మ‌యంలో ఆహారం తీసుకొనే అల‌వాటు చేసుకోవటం మేలు.

ఆహార‌మే మ‌హాభాగ్యం


సామెత కొద్దిగా మారిన‌ట్లు అనిపిస్తోంది క‌దా..! ఆరోగ్యమే మ‌హా భాగ్యం అంటారు క‌దా, కానీ, ఈ ట్విస్ట్ ఏమిటి అనుకొంటున్నారా.. దీనికి ఒక కార‌ణం ఉంది. ఆరోగ్యానికి మూలం ఆహారం అన్న మాట‌. క‌లుషిత ఆహారంతో దాదాపు 35 శాతం దాకా క్రిములు వ్యాపిస్తాయ‌ట‌. ఆహారం జాగ్రత్తగా తీసుకొంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ముఖ్యంగా వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే ఆహారపు అల‌వాట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వానలు ప‌డినప్పుడు సూక్ష్మక్రిములు ఎక్కువ‌గా వ్యాపిస్తాయి. వీటిని గుర్తించి ఆహారంలో మ‌లిన ప‌దార్థాలు లేకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వ‌ర‌కు బ‌య‌ట ఆహారం తీసుకోకుండా ఉంటే మేలు. ఇది అన్ని వేళ‌లా సాధ్యం కాదు, కాబ‌ట్టి బ‌య‌ట ఆహారం తీసుకొనేట‌ప్పుడు న‌మ్మక‌మైన చోట మాత్రమే తీసుకోవాలి. రోడ్ వెంబ‌డి ఉండే చాట్ బండ్ల ద‌గ్గర చాట్ లాగించేసే అల‌వాటు ఉంటే కాస్తజాగ్రత్త  తీసుకోవాలి. రోడ్ వెంట ఉండే సూక్ష్మక్రిములు ఈ ఆహారాన్ని ఆశిస్తాయి. దీంతో ఇబ్బంది త‌ప్పదు. ఆహారంతో పాటు తాగునీరు కూడా ముఖ్యమే. తాగునీరు లో మురికి నీరు క‌లిసిపోతే, క్రిములు వ్యాపించ‌టం త‌థ్యం. అందుకే తాగునీరు విష‌యంలో కూడా జాగ్రత్త త‌ప్పనిస‌రి...

మీ ఆరోగ్యం మీ చేతుల్లో...!


ఆరోగ్యమే మ‌హా భాగ్యం అంటారు. అటువంటి ఆరోగ్యం మ‌న చేతుల్లోనే ఉందంటే న‌మ్మగ‌ల‌రా..! అచ్చంగా ఇది నిజం. ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌టానికి చేతులే చ‌క్కటి మార్గం. ఎందుకంటే ఆరోగ్యాన్ని కాపాడేది చేతులే. ఆహారాన్ని తీసుకోటానికి, ఇత‌రుల‌తో చేతులు క‌లుపుకోవ‌టానికి, విస‌ర్జన స‌మ‌యంలోనూ అర‌చేతులు వాడుకొంటాం. ఆహారాన్ని తీసుకొనేట‌ప్పుడు అర చేతుల‌పై ఉండే సూక్ష్మజీవులు కూడా లోప‌ల‌కు వెళ్లిపోతాయి. ఆహారం చేసే మేలు మాట దేవుడెరుగు కానీ, ఈ సూక్ష్మ జీవులు చేసే హాని మాత్రం ఎక్కువే. ఈ సూక్ష్మ జీవులు ఒక‌రి నుంచి ఒక‌రికి వేగంగా వ్యాపిస్తాయి. సెంట‌ర్ ఫ‌ర్ డీసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప‌రిశోధ‌న‌ల ప్రకారం వ్యాధికార‌క సూక్ష్మ జీవుల వ్యాప్తిని నిరోధించ‌టంలో చేతుల శుభ్రత కీల‌క పాత్ర పోషిస్తుంది. ఆట‌ల‌మ్మ, క్షయ, కామెర్లు వంటి ఎయిర్ బోర్న్ వ్యాధుల వ్యాప్తి ఇది ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన అంశం.

చేతులు శుభ్రప‌ర‌చుకోవ‌టంలో అనేక ప‌ద్దతులు ఉన్నాయి. ఇవన్నీ చాలా చాలా సాధార‌ణ‌మైన ప‌ద్దతులు. స‌బ్బుతో నీరు ఉప‌యోగించుకొని క‌డుక్కోవ‌టం ఉత్తమ‌మైన ప‌ద్దతి. చేతులకు స‌బ్బు ప‌ట్టించి 20 సెక‌న్లుఆహారం తీసుకొనేముందు, మ‌ల విస‌ర్జన త‌ర్వాత చేతుల్ని శుభ్రం చేసుకొంటే చాలా వ్యాధికార‌కాల వ్యాప్తిని నిరోధించ‌వ‌చ్చు. కొన్నిసార్లు నేరుగా వేడినీటితో చేతుల్ని క‌డుక్కోవ‌చ్చు. స‌బ్సు సాలిడి కానీ, లిక్విడ్ కానీ ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇటీవ‌ల కాలంలో హ్యాండ్ వాష్ వాడకం పెరిగింది. ఇది కూడా అభిల‌ష‌ణీయ‌మే. చేతులు శుభ్రంగా నీటితో క‌డుక్కోవ‌టం ఎంత ముఖ్యమో, ఆ త‌ర్వాత చేతుల్ని తుడుచుకొని పొడిగా ఉంచుకోవ‌టం కూడా అంతే ముఖ్యం.
సాధార‌ణ పౌరుల‌కు చేతుల శుభ్రత అవ‌స‌రం. కానీ, చేత్తో లేబ‌ర్ ప‌ని చేసే కార్మిక సోద‌రులు, మెకానిక్ లు, వ‌ర్కర్లు వంటి వారికి ఇది మ‌రింత అవ‌స‌రం. అప‌రిశుభ్ర ప‌రిస్థితుల్లో పని చేసే వారంతా గుర్తుంచుకోవ‌ల‌సిన విష‌యం. ఎక్కువ మంది ఒకే కంప్యూట‌ర్ మీద ప‌నిచేసే ప‌రిస్థితి ఉంటే కీ బోర్డ్ మీద ఉండే సూక్ష్మి క్రిములు చేతి వేళ్లకు అంటుకొంటాయి. వీటి ద్వారా క్రిములు శ‌రీరంలోకి వ్యాపిస్తాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆఫీసులోనే లంచ్ చేసే సిబ్బంది ద‌గ్గర హ్యాండ్ వాష్ ఉంచుకోవ‌టం మేలు. హోట‌ల్స్ లో భోజ‌నానికి వెళ్లినప్పుడు అక్కడ మ‌రింత శుభ్రత పాటించాల్సి ఉంటుంది.